రిజర్వేషన్ కోటాపై రాందాస్తో మన్మోహన్ చర్చ
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థలో వెనుకబడ్డ కులాల రిజర్వేషన్ల కోటాను పెంచేందుకు ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాసుతో సమాలోచనలు జరిపారు. కోటాను తక్షణం హెచ్చించాలని పి.ఎం.కె. పార్టీ కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఓబిసి కేటగిరీకి చెందిన విద్యార్ధులు ఉన్నత విద్యా సంస్థల్లో కోటా హెచ్చింపు అందుబాటులోకి వస్తుందని చాలా కాలం ఎదురు చూశారని, సౌకర్యాలు మెరుగు పరిచేంత వరకు ప్రస్తుతం ఉన్న వసతులతోనే అన్ రిజర్వుడు కేటగిరీకి చెందిన విద్యార్ధులకు సీట్లు సర్దుబాటు చేయాలని రాందాస్ సూచించారు. వీటి అమలుకు శాసనం చేయాలని కూడా పి.ఎం.కె. పార్టీ ఈ సందర్భంగా కోరినట్లు, రాందాస్ చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు యు.పి.ఎ. ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, రక్షణ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాలలో ఒకరైన ఆర్.జె.డి. పార్టీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని క్రితం రోజు ప్రకటించడంతో ప్రధాని ప్రయత్నాలకు బలం చేకూరినట్టయింది.