బాధితులకు మరింత సాయం: బాబు వినతి
శ్రీకాకుళం: వరద బాధితులకు మానవతా దృక్పథంతో సాయాన్ని మరింత అందించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన సోమవారంనాడు శ్రీకాకుళం జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితులతో ఆయన మాట్లాడారు. తమకు తగిన సహాయం అందడం లేదని బాధితులు చంద్రబాబుకు చెప్పుకున్నారు. చంద్రబాబు పర్యటనతో అధికారులు హడావిడిగా బాధితులకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు కూడా వున్నారు.
వరద బాధితులకు సహాయం అందించే విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. వరద తాకిడి ప్రాంతాల్లోని పరిస్థితులను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వయంగా సమీక్షించడం అవసరమని ఆయన అన్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబు ఆ తర్వాత బాధితులను పరామర్శించడానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. భద్రత కుదించిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది హెచ్చరించినా ఆయన లెక్క చేయలేదు.