నా భద్రత బాధ్యత ప్రభుత్వానిదే: బాబు
విశాఖపట్నం: తన భద్రతను ప్రభుత్వమే చూసుకోవాల్సి వుంటుందని, చూసుకుంటుందని ఆశిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకు భద్రతను తగ్గించడంపై అన్నారు. ఉత్తరాంధ్రలో వరద తాకిడి ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించి, సహాయ పునరావాస చర్యలను పరిశీలించేందుకు ఆయన సోమవారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు భద్రత తగ్గించడంపై వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు.
వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై కూడా ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని, అలా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం సహాయ పునరావాస కార్యక్రమాలపై తాను మాట్లాడుతానని ఆయన చెప్పారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి తాను వచ్చానని ఆయన చెప్పారు.