వరద బీభత్సం: 94 మంది మృతి
హైదరాబాద్: వరద తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా 94 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా పలువురి ఆచూకీ తెలియడం లేదు. మెదక్ జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్ జిల్లాలో 8 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, కరీంనగర్ జిల్లాలో ఆరుగురు, నల్లగొండ జిల్లాలో ఒకరు, హైదరాబాద్లో ముగ్గురు మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, విజయనగరం జిల్లాలో 13 మంది, విశాఖపట్నం జిల్లాలో 16 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో నీట చిక్కుకున్న ప్రజల పరిస్థితి దయనీయంగా వుంది. సహాయ చర్యలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా వరద తాకిడి బాధితులను పరామర్శించారు. గోదావరి గట్లను పటిష్టం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద బాధితులకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాత పోలవరంలో పడవ మునిగి ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం అన్వేషణ సాగుతోంది. పోలవరం గ్రామం గత రెండు రోజులుగా నీట మునిగి వుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద గోదావరి నదిలో ఒక వృద్ధుడు గల్లంతయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం - ముమ్మిడివరం జాతీయ రహదారి వరద తాకిడికి తెగిపోయింది. ముమ్మిడివరంలోని ఎస్సి హాస్టల్ నీట మునిగింది. దీంతో హాస్టలు విద్యార్థులు 300 మంది భవనంపైకి ఎక్కి సహాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నానికి ఐదు మృతదేహాలు కొట్టుకుని వచ్చాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలి వాగులో ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ పొంగిపొర్లుతోంది. మహారాష్ట్రలో ఆంధ్ర సరిహద్దు గ్రామాలు 35 నీట మునిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 18 గ్రామాలు జలదిగ్బంధంలోనే వున్నాయి.