భద్రాచలం వద్ద తగ్గుముఖం: కోనసీమ బీభత్సం
హైదరాబాద్: గోదావరి వరద నీటి మట్టం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతోంది. అయితే భద్రచలం సమీపంలోని కొన్ని గ్రామాలు, కోనసీమ వరద తాకిడికి విలవిలలాడుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా పరిస్థితి దయనీయంగా వుంది. ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాలో పునరావాస చర్యలను వేగవంతం చేయడానికి, బాధితులకు తగిన సహాయం అందించడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ముగ్గురు ప్రత్యేకాధికారులను నియమించారు. వరద పరిస్థితిని ముఖ్యమంత్రి సోమవారం ఉదయం హైదరాబాద్లో సమీక్షించారు. కోనసీమలో బాధితులకు ఆదుకునేందుకు రెండు హెలికాప్టర్లను నియోగించారు. సైన్యం కూడా రంగంలోకి దిగింది. వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన సోమవారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 65.2 అడుగులుంది. దాదాపు 200 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అగులకు చేరుకుంటే తప్ప ఆ గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయటపడవు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లాలో 300 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరికి 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోనసీమలో 50 గ్రామాల ప్రజలు సొంతగూళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నాటు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోనసీమలో 10 మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
తెలంగాణలోనూ వరద బీభత్సం సృష్టించింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు వరద బీభత్సానికి గురయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ ఉప్పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరో 4 వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. వరంగల్ జిల్లాలో పలు గ్రామాల్లో పెద్ద యెత్తున నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.