పాఠక్ నివేదిక లీక్: దద్ధరల్లిన పార్లమెంటు
న్యూఢిల్లీ: ఇరాక్ చమురు ముడుపులపై ఏర్పాటయిన జస్టిస్ పాఠక్ కమిటీ నివేదిక లీక్ వ్యవహారం సోమవారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. పాఠక్ కమిటీ నివేదిక లీక్కు బాధ్యత వహించి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) సభ్యులు లోక్సభ కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభను 11 గంటల 45 నిమిషాల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సద్దుమణగకపోవడంతో తిరిగి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. చమురు ముడుపుల కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని రక్షించే ప్రయత్నం పాఠక్ కమిటీ నివేదిక ద్వారా చేస్తున్నారని యన్డిఎ విమర్శించింది. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్సింగ్ను బలి పశువును చేసి సోనియాను కాపాడడమే కమిటీ ఉద్దేశమని వ్యాఖ్యానించింది.
పాఠక్ కమిటీ నివేదిక లీక్పై మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్పై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇచ్చారు. లీక్కు బాధ్యత వహించి ప్రధాని క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. పాఠక్ కమిటీ నివేదికపై రాజ్యసభలోనూ గందరగోళం చెలరేగింది. మన్మోహన్ సింగ్ రాజీనామాకు యన్డిఎ సభ్యులు పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభ మొదట 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.