వరద బాధితుల సహాయానికి పియం హామీ: వైయస్
రాజమండ్రి: వరద తాకిడి బాధితులకు తగిన సహాయం అందిస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల పరిస్థితిని తాను ప్రధానికి వివరించి సహాయం కోరానని ఆయన చెప్పారు. కోస్తాంధ్ర వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన సోమవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజమండ్రిలో కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇదే సమయంలో సోనియా గాంధీ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి వరద పరిస్థితిపై వాకబు చేశారు. పరిస్థితిని రాజశేఖర రెడ్డి సోనియాకు వివరించారు.
వరదల తాకిడికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 86 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు మరణించినట్లు ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో సహాయ కార్యక్రమాల కోసం మరో రెండు హెలికాప్టర్లను తెప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 18 పునరావాస కేంద్రాల్లో 6 వేల మంది ఆశ్రయం పొందుతున్నట్లు ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 28 గ్రామాలు ముంపునకు గురైనట్లు ఆయన తెలిపారు. పోలవరం నుంచి 40 కిలోమీటర్ల మేర గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగవచ్చునని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3 లక్షల మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.