సహాయం తగ్గింపు జీవో జారీపై బాబు మండిపాటు
శ్రీకాకుళం: వరద బాధితులకు అందించే సహాయాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద సహాయ చర్యలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పేదలకు కాస్తా ఎక్కువ అందడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
వరద సహాయ చర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా, అసమర్థంగా వ్యవహరిస్తోందని, దీని వల్లనే వరద నష్టం పెరిగిందని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాఫియా లీడర్లుగా తయారు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.