సహాయ చర్యల్లో వైయస్ విఫలం: మధు, రావుల
న్యూఢిల్లీ: వరద సహాయ చర్యలు చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని సిపియం, తెలుగుదేశం మంగళవారం రాజ్యసభలో విమర్శించాయి. ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలో వరద పరిస్థితి నుంచి ప్రజలను కాపాడేవారు లేరని సిపియం సభ్యుడు సిహెచ్. మధు అన్నారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కూడా ఆయన కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న వరద సహాయం సరిపోవడం లేదని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయానికి సైన్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, అయితే సైన్యాన్ని పంపేందుకు ప్రయత్నాలు జరిగినట్లు లేదని ఆయన అన్నారు.
వరదతాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శించారు. ఈ సమయంలో రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శకు ఆంధ్రప్రదేశ్కు చెందని సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శను మంత్రి రేణుకా చౌదరి తీవ్రంగా తప్పు పట్టారు. వరదలు ఉధృతంగా ఉన్నా పంట నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి అనడాన్ని చంద్రశేఖర రెడ్డి తప్పు పట్టారు.