నష్టం అపారం: మృతుల సంఖ్య 105
హైదరాబాద్: వరద సృష్టించిన బీభత్సంతో కోనసీమ విలవిలలాడుతోంది. బాధితులకు సరిగా సహాయం అందడం లేదు. బాధితులు అధికారులపై మండిపడుతున్నారు. వశిష్ట గోదావరికి మొండెంలంక వద్ద గండి పడడంతో 80 గ్రామాలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పడవల్లో వెళ్లడానికి కూడా వీలు లేని పరిస్థితి. దీంతో బాధితులకు సాయం అందడం లేదు. రాష్ట్రంలో వరద తాకిడికి మరణించిన వారి సంఖ్య 105కు చేరుకుంది. వరద సహాయానికి తక్షణమే 180 కోట్ల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఇక్కడికి వస్తున్నారు. 1.41 లక్షల కుటుంబాలపై వరద ప్రభావం పడింది. రాష్ట్రంలో 3.78 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదతాకిడి 447 మండలాల్లోని 5,412 గ్రామాలు గురయ్యాయి. 15,158 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వివరాలు పూర్తిగా అందేసరికి నష్టం నాలుగు రెట్లు పెరగవచ్చునని భావిస్తున్నారు.
భద్రాచలం వద్దనే కాకుండా ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి వరద నీటి మట్టం తగ్గింది. అయితే ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద బీభత్సం కళ్లకు కట్టినట్లు కనిపిస్తూనే వుంది. బాధితులు నిరాశ్రయులై అల్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ మళ్లీ ఉధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని 18 గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయట పడలేదు. నిజామాబాద్ జిల్లాలోనూ అపార నష్టం సంభవించింది. ఖమ్మం జిల్లాలోని పునరావాస శిబిరాల్లో బాధితులు రోగాల బారిన పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వందలాది ఏజెన్సీ గ్రామాలు నీట మునిగే వున్నాయి.