సోనియా పర్యటన వల్ల ఒరిగేదేమీ లేదు: బాబు
అమలాపురం: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ఒరిగేదేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సోనియా పర్యటనతో చంద్రబాబు అమలాపురం పర్యటన అర్థాంతరంగా ముగిసింది. అమలాపురంలోని సహాయ శిబిరాలను సందర్శించడానికి చంద్రబాబును అనుమతించలేదు. సోనియా పర్యటనతో ఆమె భద్రతా సిబ్బంది చంద్రబాబుకు అనుమతి నిరాకరించింది. దీని పట్ల చంద్రబాబు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. తనను అనుమతించకపోవడాన్ని వివాదం చేయదలుచుకున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే తనను అనుమతించలేదని ఆయన అన్నారు.
సోనియా గాంధీ పర్యటన మధ్యాహ్నం 12 గంటలకు ఉందని చెప్పారని, దాంతో తాను ఏడు గంటలకు సందర్శిస్తానని చెప్పానని, అయినా అంగీకరించలేదని, ఇది దురదృష్టకరమని ఆయన అన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలి పర్యటనతో మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని అయిన తనను అనుమతించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షురాలి పర్యటన వల్ల లాభం ఏమీ వుండదని, ప్రధాని, వ్యవసాయ శాఖ మంత్రి పర్యటిస్తే మేలు చేయడానికి వీలుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వరదలు తీవ్రంగా వచ్చి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడిన ఈ తరుణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం అభ్యంతరకరమని ఆయన అన్నారు. బాధితులకు సరిగా సహాయం అందడం లేదని ఆయన విమర్శించారు. సహాయాన్ని తగ్గించడాన్ని కూడా ఆయన అభ్యంతర పెట్టారు.