కొసరాజుకు నార్కో ఎనాలిసిస్ టెస్టు: కోర్టు అనుమతి
హైదరాబాద్: డిపాజిటర్లను మోసగించిన కృషి బ్యాంక్ చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావుకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించడానికి నాంపల్లి కోర్టు సిఐడికి అనుమతి ఇచ్చింది. వెంకటేశ్వరరావుకు గుజరాత్లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో నార్కో ఎనాలిసిస్ టెస్టులు నిర్వహిస్తారు. ఇప్పటికే వెంకటేశ్వరరావుకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. అయితే వెంకటేశ్వరరావు చాలా విషయాలు దాస్తున్నాడని సిఐడి భావించి నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ మంగళవారంనాడు ముగిసింది. కోర్టు తన నిర్ణయాన్ని బుధవారంనాడు వెల్లడించింది.
డిపాజిటర్లను మోసగించి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు వెంకటేశ్వరరావు పారిపోయాడు. అతడ్ని సిఐడి పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. అయితే తన ఆస్తులను అమ్మి డిపాజిటర్ల సొమ్ము చెల్లిస్తానని, తనను ఎవరినీ మోసం చేయబోనని వెంకటేశ్వరరావు అంటూ వస్తున్నాడు. వెంకటేశ్వరరావు సిఐడి విచారణలో ఇద్దరు మాజీ డిజిపిల పేర్లను వెల్లడించినట్లు కూడా వార్తలు వచ్చాయి. చార్మినార్ బ్యాంక్ యాజమాన్యం నుంచి ప్రాణ భయం వుండడం వల్లనే తాను పారిపోయానని చెబుతున్నాడు. కృషి బ్యాంక్ ఎలా నష్టాల్లో కూరుకుపోయిందో తనకు తెలియదని కూడా అంటూ వస్తున్నాడు.