సోనియా రాజకీయ పర్యటన దండగ: సిపియం
హైదరాబాద్: రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్యటన వల్ల లాభమేమీ వుండదని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరద బాధితుల కోసం చేపట్టిన సహాయ చర్యలను ఇప్పటికైనా వేగవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లోని 65 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి జారీ చేసిన ఐదో నెంబర్ జీవో రద్దుకు వచ్చే శాసససభా సమావేశాల్లో ప్రధానంగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని భూమల వేలం పాటలను కూడా అసెంబ్లీలో ఎజెండాగా తీసుకుంటామని ఆయన చెప్పారు. ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే 610 జీవోను చాలా కాలంగా అమలు చేయడం లేదని, దాన్ని అమలు చేయించడానికి కూడా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని యాన చెప్పారు.