గోదావరి వరద తగ్గుముఖం: కోలుకోని గ్రామాలు
హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి నది వరద ఉధృతి తగ్గింది. అయితే కోనసీమలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని వున్నాయి. పలు గ్రామాల బాధితులకు సహాయం సరిగా అందడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో మునుపెన్నడూ లేనంత ఉధృతంగా ఉప్పొంగిన పెన్గంగ శాంతిస్తోంది. పెన్గంగ వంతెన మరమ్మతులు ప్రారంభమయ్యాయి. పెన్గంగ వరద నీటిలో చిక్కుకున్న క్వాలిస్ వాహనం బయట పడింది. ఆ వాహనంలో మృతదేహాలు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఏడో నెంబరు జాతీయ రహదారిపై ఈ సాయంత్రానికల్లా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా నీటితో అల్లాడుతున్న 18 గ్రామాల్లో నీరు తగ్గుముఖం పడుతోంది.
ధవళేశ్వరం వద్ద గోదావరి నది వరద నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద సూచికను ఉపసంహరించుకున్నారు. అయితే ఖమ్మం జిల్లాలోని వరద బాధితులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లడానికి తగిన మార్గాలు ఇంకా కనిపించడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఆరు మండలాల్లోని గ్రామాలు ఇంకా నీటిలోనే చిక్కుకుని వున్నాయి. రాష్ట్రంలో వరద తాకిడి 15,487 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద తాకిడికి 990 గ్రామాలు గురయ్యాయి. మృతుల సంఖ్య 106కు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని 8 మండలాలను వరద తాకింది.