సోనియా చూశారు, ఢిల్లీకి తిరిగి వెళ్లారు
హైదరాబాద్: రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్యటించి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె ఒక్క మాటా మాట్లాడలేదు. మొదట ఉభయ గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అమలాపురంలోని సహాయ శిబిరాల్లోని బాధితులను పది నిమిషాల పాటు పరామర్శించారు. అయితే సోనియా మాట్లాడుతున్న విషయాలు బాధితులకు, బాధితులు చెప్పిన విషయాలు సోనియాకు అందలేదు. అలా అందించే ఏర్పాట్లు ఏవీ జరగలేదు. ఆ తర్వాత ఆమె ఖమ్మం జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. భద్రాచలంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటయిన సహాయ శిబిరంలోని బాధితులను పరామర్శించారు. అనంతరం బూర్గుంపాడులోని బాధితులను ఐదు నిమిషాల పాటు పరామర్శించారు.
భద్రాచలం నుంచి ఆమె నేరుగా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వరద తాకిడి ప్రాంతాలపై ఏర్పాటయిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆమె అక్కడ సందర్శించారు. అయితే మీడియాతో ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె వెంట వున్న కేంద్ర హోం మంత్రి శివరాజ్పాటిల్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వరద బాధితుల సహాయార్థం కేంద్రం 200 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన చెప్పారు. శాశ్వత పునరావాస చర్యలకు సంబంధించినంత వరకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రాష్ట్రాల సహకారంతో ప్రణాళికలు రూపొందిస్తుందని ఆయన చెప్పారు. అనంతరం సోనియాతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. సోనియా వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రేణుకాచౌదరి, దాసరి నారాయణరావు, తదితరులు పర్యటనలో పాల్గొన్నారు.