సమీక్ష సరిపోదు: ప్రధానికి టిడిపిపి లేఖ
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని వరద పరిస్థితిని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హైదరాబాద్లోని విమానాశ్రయంలో సమీక్షిస్తే సరిపోదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నేత కె. ఎర్రంనాయుడు అన్నారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి సమీక్షిస్తే సరిపోదని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా చూడాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక లేఖ రాశారు.
రాష్ట్రం వరద తాకిడికి గురై ఐదారు రోజులైనా ఇప్పటి వరకు ప్రధాని పర్యటించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా చూస్తేనే వరద తీవ్రత తెలుస్తుందని ఆయన అన్నారు. జాతీయ వైపరీత్యాల సహాయ నిధి నుంచి రాష్ట్రానికి కేంద్రం 200 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, ఇది రాష్ట్రం హక్కు అని, జతీయ విపత్తు నిధి నుంచి సహాయం అందించడం అవసరమని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన ప్రధానిని కోరారు. రాష్ట్రంలో పర్యటించి రైతులకు తగిన సహాయం అందించడానికి ముందుకు రావాలని ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్పవార్కు కూడా ఆయన లేఖ రాశారు.