పరామర్శకు వెళ్లిన మంత్రులకు చుక్కెదురు
హైదరాబాద్: వరద బాధితుల పరామర్శకు బయలుదేరిన మంత్రులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఐనవెల్లి మండలం కె. జగన్నాథపురం గ్రామంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, స్థానిక శాసనసభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి బాధితుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఐదు రోజులుగా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చారా? అంటూ బాధితులు వారిని నిలదీశారు. తమ శాసనసభ్యుడు చిట్టబ్బాయి తమను అసలు పట్టించుకోవడం లేదని వారు ఆక్రోశించారు. గ్రామంలో రాస్తారోకోకు దిగారు.
నిలదీసిన బాధితులపై చిట్టబ్బాయి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపైకి ఎగబడడానికి ప్రయత్నించారు. ఆయనను బలవంతంగా నిలువరించాల్సి వచ్చింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మరో మంత్రి రెడ్యానాయక్ బాధితుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. పెండల్వాడ గ్రామ బాధితులు మంత్రి రెడ్యా నాయక్ను ఘెరావ్ చేశారు. తమకు ఏ మాత్రం సహాయం అందించకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా సాయం అందిస్తుంటే మీరేం చేస్తున్నారని వారు మంత్రిని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ, ఆదిలాబాద్ జిల్లాలోనూ వరద తాకిడి బీభత్సం సృష్టించింది. బాధితులకు ఆహారం పొట్లాలు కూడా సరిగా అందలేదు. ఖమ్మం జిల్లా బాధితులకు కూడా అరకొరగానే సహాయం అందుతోంది.