మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
హైదరాబాద్: మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. విప్లవ రచయితల సంఘాన్ని (విరసాన్ని) నిషేధం నుంచి మినహాయించింది. ఐయస్ఐ మోటార్లు పెట్టుకునే రైతులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వచ్చే శాసనసభా సమావేశాల్లో పది బిల్లులను ప్రతిపాదించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.
జనాభా ప్రాతిపదిక మీద శాసనమండలి సెగ్మెంట్లను పునర్విభజించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ను కోరాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వరద తాకిడికి గురైన మారుమూల ప్రాంతాల్లో సమర్థంగా వైద్య సేవలు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని 23 గ్రామాలకు ఇంకా రవాణా సౌకర్యాల పునరుద్ధరణ జరగలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ చెప్పారు.