సాగర్లో నిమజ్జనానికి ఈ ఏడాదికి సరే: హైకోర్టు
హైదరాబాద్: ఈ ఏడాదికి హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు తెలియజేసింది. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనానికి అనుమతించేది లేదని హైకోర్టు ఇంతకు ముందు తేల్చి చెప్పింది. అయితే దాని వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ మోహన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. దానిపై హైకోర్టు వివరణ అడిగింది.
నిమజ్జనం జరిగిన మూడు రోజుల్లోగా వ్యర్థ పదార్థాలను తొలగిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. నిమజ్జనం సందర్భంగా జనజీవనానికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది నిమజ్జనానికి హైకోర్టు కొన్ని షరతులతో అంగీకరించింది. వచ్చే ఏడాది నిమజ్జనం వరకు కేసు కొనసాగుతూనే వుంటుందని తెలియజేసింది. హుస్సేన్సాగర్లో నిమజ్జనం వల్ల తలెత్తే పరిణామాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వానికి సూచించింది.