ఎన్నికల కమీషన్పై హైకోర్టు మండిపాటు
హైదరాబాద్: ఓట్ల గల్లంతు విషయంలో తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమీషన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓట్ల గల్లంతుపై ఎన్నికల కమీషన్ కార్యదర్శి జి. నారాయణ రావు కోర్టు హాజరై వివరణ ఇచ్చారు. ఓట్ల గల్లంతుపై ఎన్ని ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోకపోవడంపై హైకోర్టు కమీషన్పై మండిపడింది. తన ఓటు గల్లంతుపై వరంగల్ జిల్లా జనగాం నివాసి ఒకరు హైకోర్టు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఎన్నికల కమీషన్ అమలు చేయలేదని జనగాం నివాసి మళ్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎన్నికల కమీషన్ పద్ధతిని హైకోర్టు నిరసించింది.
కోర్టు ఆదేశాలను పాటించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని హైకోర్టు మరో కేసులో విశాఖపట్నం కలెక్టర్ను, నగరపాలక సంస్థ అధికారులను హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో నగర పాలక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న నిర్మాణాలను ఆపించాలని కోరుతూ మత్స్యకారుల యువజన సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నిర్మాణాలను ఆపించాలని మార్చి 7వ తేదీన హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే మళ్లీ నిర్మాణాలు ప్రారంభించడంతో పిటిషనర్లకు మళ్లీ కోర్టుకెక్కారు. దీంతో అధికారుల తీరుపై హైకోర్టు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ తమ ఆదేశాలను పాటించకపోతే ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి వుంటుందని హెచ్చరించింది.