రాష్ట్రంలో విధ్వంసాలకు లష్కర్ తీవ్రవాదుల కుట్ర
హైదరాబాద్: రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీన విధ్వంసాలకు లష్కర్ - ఎ - తోయిబా పథకం రచించినట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ డ్యామ్, విజయవాడ పవర్ స్టేషన్, తుంగభద్ర ఆనట్ట వంటి భారీ నిర్మాణాలను పేల్చివేయడానికి లష్కర్ - ఎ - తోయిబా తీవ్రవాదులు కుట్ర చేసినట్లు నిఘా విభాగాలకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు అధికారులకు 12 అంశాలతో కూడిన సర్క్యులర్ను రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేశారు.
ముంబాయి పేలుళ్ల తర్వాత తమకు పట్టు వున్న హైదరాబాద్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు సమాచారం. కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడాలని ఉగ్రవాదులు పథకాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రద్దీగా వుండే మార్కెట్లను, ఆర్యస్యస్ కార్యాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నినట్లు కేంద్ర నిఘా విభాగాలు రాష్ట్రానికి సమాచారం అందించారు. తమతో కలిసి వచ్చే ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసి విధ్వంసాలకు దిగాలని లష్కర్ - ఎ - తోయిబా అనుకుంటున్నట్లు సమాచారం.