వరద ప్రాంతాల్లో మంత్రులకు తప్పని బాధలు
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లోని బాధితులు తమను పరామర్శించడానికి వస్తున్న మంత్రులను నిలదీయడం కొనసాగుతూనే వుంది. తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండంలోని వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రోడ్లు భవనాల శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావును, జిల్లా ఇన్చార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బాధితులు నిలదీశారు. తాము వినిపిస్తున్న సమస్యలకు మంత్రులు సరిగా స్పందించకపోవడంతో బాధితులు మండిపడ్డారు. ఒక సందర్భంలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, తదితర మండలాల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జిల్లా ఇన్చార్జి రెడ్యా నాయక్కు చేదు అనుభవం ఎదురైంది. బాధితులు మంత్రిని నిలదీశారు. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు విమర్శించడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో మంత్రి ఆగ్రహం చెంది అక్కడి నుంచి వెనక్కి మళ్లారు. కాగా, జిల్లా మంత్రి జి. వినోద్ ఇప్పటి వరకు బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు. వినోద్ విషయమై ప్రస్తావించగా తాను రావడానికే రెండు రోజులు పట్టిందని రెడ్యా నాయక్ వ్యాఖ్యానించారు.