కాంగ్రెస్ కార్యకర్త దారుణహత్య
అనంతపురం, ఆగస్టు 12 : మంత్రి జె.సి. దివాకర్రెడ్డి సొంత నియోజకవర్గమైన తాడిపత్రిలో ఆయన అనుచరుడు, స్థానిక నాయకుడు కులశేఖర్రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కులశేఖర్రెడ్డిని ప్రత్యర్ధులు సజీవ దహనం చేశారు. పంచాయితీ ఎన్నికలు రగిల్చిన రావణకాష్టం ఫ్యాక్షన్ గ్రామాలలో ఇంకా ఆరలేదనడానికి ఈ హత్య ఉదాహరణ. కులశేఖర్రెడ్డి హత్యతో గ్రామంలో రెండు వర్గాల మధ్య దాడులు జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కులశేఖర్రెడ్డి ప్రత్యర్థి అయిన సిపిఐ నాయకుడు విశ్వనాథరెడ్డి, ఆ పార్టీకార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందికు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కులశేఖర్రెడ్డి తల్లి విజయం సాధించగా విశ్వనాధ్రెడ్డి (సిపిఐ) తల్లి ఓటమిపాలయ్యారు. విశ్వనాధ్రెడ్డికి చెందిన తోటలోనే కులశేఖర్రెడ్డి సజీవదహనం కావడం పలు అనుమానాలను తావిస్తోంది.