వరద సహాయంలోనూ రాజకీయం: బాబు
హైదరాబాద్: వరద సహాయంలోనూ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. వారం రోజుల పాటు వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరద తాకిడికి సర్వం కోల్పోయినవారికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఏ మాత్రం బాగా లేదని ఆయన అన్నారు. వరద సహాయం అందించే విషయంలో అధికారులకు దిశానిర్దేశం చేయడంలో ముఖ్యమంత్రి, మంత్రులు విఫలమయ్యారని ఆయన అన్నారు. రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాలని, రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వరదలకు నష్టపోయిన రైతులను, మత్స్యకారులను ఆదుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు.