వరద బాధితులకు వేయి కోట్లు ఇవ్వాలి: బిజెపి
హైదరాబాద్: వరద బాధితుల సహాయానికి వేయి కోట్ల రూపాయలు విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. వరద తాకిడి ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన అన్నారు. వరద బాధితుల కోసం పది లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. వరద తాకిడి ప్రాంతాల్లో రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాలని, రుణాలపై వడ్డీలను మాఫీ చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు విమర్శించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అరకొరగానే సహాయం రాబట్టిందని, ఇప్పుడు తాము ఎన్నడూ లేనంత సహాయాన్ని కేంద్రం నుంచి రాబట్టామని ఆయన చెప్పారు.