జమ్మూలో ఒసామా బిన్ లాడెన్ సీడీ లభ్యం
జమ్మూ: జిహాద్కు సిద్ధం కావాలని యువతకు పిలుపునిస్తూ రికార్డు చేసిన ఆల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ప్రసంగం సీడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నాలుగు సీడీల్లో లాడెన్ ప్రసంగం ఉన్న సీడి ఒకటి. ఈ సీడీలను మెంధార్ తెహిసిల్లోని గుర్సాయి నుల్లా వద్ద జరిగిన ఎన్కౌంటర్ సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పూంఛ్ సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ ఎస్.డి. సింగ్ జమ్వాల్ చెప్పారు. లాడెన్ మిలిటెంట్లను, యువతను ఉద్దేశించి జిహాద్కు పిలుపునిస్తూ చేసిన ప్రసంగం 28 నిమిషాలు సీడీలో రికార్డు అయి వున్నట్లు ఆయన చెప్పారు.
లాడెన్ సీడీ జమ్మూ కాశ్మీర్లో లభించడం బహుశా ఇదే తొలిసారి అని, లష్కర్ - ఎ - తోయిబా మిలిటెంట్ల వద్ద అది లభించడం ప్రత్యేకతను సంతరించుకుందని ఆయన అన్నారు. ఇది లష్కర్ - ఎ - తోయిబాకు, ఆల్ ఖైదాకు మధ్య వున్న సంబంధాలను పట్టిస్తుందని ఆయన అన్నారు. మిలిటెంట్లు విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి రాష్ట్ర పోలీసులు సిద్ధంగా వున్నారని ఆయన అన్నారు. ఆ సీడీ ఎక్కడ, ఎప్పుడు తయారైందనేది తెలుసుకోవాల్సి వుందని ఆయన అన్నారు. మిగతా సిడిల్లో మిలిటెంట్లకు ఇచ్చే శిక్షణా పద్ధతులున్నాయని ఆయన చెప్పారు. ఈ సీడీలతో లష్కర్ - ఎ - తోయిబా భారతదేశంలోని యువతకు శిక్షణ ఇస్తోందని ఆయన అన్నారు. ఒక సీడీలో హిందీ సినిమా వుందని, మరో సీడీ చెడిపోయి ఓపెన్ కావడం లేదని ఆయన చెప్పారు.