తెలంగాణ అగ్నిగుండంగా మారితే ఆర్పలేం: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రమంత్రిగా తాను ఢిల్లీకి వెళ్ళడం ఇదే ఆఖరుసారి కావచ్చని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం ఇక్కడ చెప్పారు. మంచి జరగాలనే తాము కోరుకుంటున్నామని, తెలంగాణ అగ్నిగుండంగా మారితే ఆ బాధ్యత కాంగ్రెస్దేనని ఆయన హెచ్చరించారు. గతంలో తెలంగాణ ఉద్యమాలు హింసాయుతంగా జరిగాయని, తాము మాత్రం శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, ఒక వేళ ఉద్యమం హింసాయుతంగా మారుతే తాము చేయగలిగింది ఏమీ లేదని చంద్రశేఖరరావు అన్నారు. జూబిలీహిల్స్లో టిఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయ భవనానికి ఆయన ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఎంతో ఓపిక పట్టామని, కాంగ్రెస్ అధిష్టానవర్గానికి తగిన సమయం ఇచ్చామని, వారితో సహకరించామని ఆయన చెప్పారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కెసిఆర్, నరేంద్రలు సతీసమేతంగా యాగం నిర్వహించారు.