విషమించిన బిస్మిల్లాఖాన్ ఆరోగ్యం
వారణాసి: ప్రముఖ షెహనాయి విద్వాంసుడు, భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ఆరోగ్యం విషమించింది. ఆయనకు కుటుంబ వైద్యులు ద్రవరూపంలో ఆహారాన్ని అందిస్తున్నారు. 91 యేళ్ల బిస్మిల్లాఖాన్ వృద్ధాప్యపు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కుటుంబ వైద్యుడు నదీమ్ జాఫ్రీ తమ తండ్రికి గ్లూకోజ్ అందిస్తున్నారని బిస్మిల్లాఖాన్ కుమారుడు కజీం హుస్సేన్ చెప్పారు. గత 15 రోజులుగా బిస్మిల్లాఖాన్ ఘనరూపంలోని ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారని, బిస్మిల్లాఖాన్ ఆరోగ్యం నిలకడగా వుందని ఆయన వివరించారు.
ఆరోగ్యం మరింత విషమించే పరిస్థితిలో బిస్మిల్లాఖాన్ను వారణాసిలో లేదా లక్నోలో ఆస్పత్రిలో చేర్పిస్తామని ఆయన చెప్పారు. బిస్మిల్లాఖాన్ ఆరోగ్యం విషమించిందనే వార్తతో శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం హార్దా సరాయ్కు చేరుకున్నారు. సాధ్యమైనంత ఉత్తమ వైద్యాన్ని అందించాలని వారణాసి అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రాజధానిలోని ప్రభుత్వ కార్యదర్శి ఎన్.సి. బాజ్పాయ్ ఆదేశించారు. ఆస్పత్రిలో చేర్చాలా, లక్నోకు తీసికెళ్లాలా అనే విషయంపై జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుంది.