ఉత్తర కోస్తాకు వర్షాలు: ఉప్పొంగుతున్న తుంగభద్ర
హైదరాబాద్: ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నది ఉప్పొంగుతుండగా, ఇటు కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి పొర్లుతున్నాయి. ఒరిస్సా తీరానికి సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో అప్పలడం ఏర్పడి బలపడుతోంది. దీంతో ఒరిస్సాలోని రాయఘడ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగా నాగావళి నదికి వరద ముప్పు వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు కురిసే అవకాశం వుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుంది.
మరో వైపు తుంగభద్ర, కృష్ణా నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. హోస్పేట వద్ద తుంగభద్ర నీటిని దిగువకు వదలడంతో తుంగభద్రలో, కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీని వల్ల కర్నూలు జిల్లాలోని నాలుగు గ్రామాలు నీటి మునిగే ప్రమాదం వాటిల్లింది. మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల్లో 4 వేల ఎకరాల పంటలు నాశనమయ్యాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడంతో విజయవాడలోని 2 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించి బస్సు స్టాండులో శిబిరం ఏర్పాటు చేశారు. నీటి మట్టం తగ్గకపోగా పెరుగుతుండడంతో వారు అక్కడే వుంటున్నారు. విజయవాడలోని భ్రమరాంబపురం ఏడాది బాలుడు నీటి పడి మరణించిన సంఘటనతో విషాదం నెలకొంది.