నేను లేకున్నా చర్యలు భేష్: రఘువీరా
విజయవాడ: తాను లేకున్నా వరద బాధితులకు సహాయచర్యలు చేపట్టడంలో అధికారులు భేషుగ్గా వ్యవహరించారని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి మెచ్చుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలంచడానికి ఆయన బుధవారం ఇక్కడికి వచ్చారు. తాను విదేశీ పర్యటనకు వెళ్లే ముందు వరద తీవ్రత ఇంత పెద్దగా లేదని, రెండు మూడు జిల్లాల్లో మాత్రమే కాస్త ఇబ్బందిగా వుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయన వ్యవసాయాధికారులతో సమీక్ష జరిపి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన నిమిత్తం వచ్చారు.
గతంలో వరద బాధితులైన రైతులకు విత్తానాలపై సబ్సిడీ లేదా ఇన్పుట్ సబ్బిడీ ఏదో ఒకటి ఇచ్చేవారని, తాము ఇప్పుడు రెండు సబ్సిడీలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో పంపిణీకి 65 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేస్తామని, విత్తనాలు 50 శాతం సబ్సిడీతో ఇస్తామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు సిద్ధం చేశామని, స్వల్ప కాలిక పంటలకు ప్రణాళికలు తయారయ్యాయని ఆయన చెప్పారు.