అసెంబ్లీ: వరదపై చర్చకు పట్టు, వాయిదా
హైదరాబాద్: శాసనసభ సమావేశాల తొలి రోజే గురువారం తీవ్ర గందరగోళం చెలరేగి అర్థాంతరంగా రేపటికి వాయిదా పడింది. వరద పరిస్థితిపై తక్షణమే చర్చ జరగాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో చేసిన డిమాండ్కు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి అనుమతించకపోవడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. వరద పరిస్థితిపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దానికి స్పీకర్ అనుమతించలేదు. అయినా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు.
ఎజెండా ప్రకారం సభ సమావేశాలు జరగడానికి సహకరించాలని స్పీకర్ ప్రతిపక్షాల సభ్యులను కోరారు. వరద పరిస్థితిపై రేపు చర్చకు అనుమతిస్తామని ఆయన చెప్పారు. అయినా ప్రతిపక్షాలు పట్టు వీడకపోవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ రెండు సార్లు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత పరిస్థితి సద్దుమణగకపోవడంతో చివరకు రేపటికి వాయిదా వేశారు. వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం, ఎజెండాను పక్కన పెట్టి తక్షణ చర్చకు ఆ అంశాన్ని చేపట్టడం నిబంధనలకు విరుద్ధమేమీ కాదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అలా చర్చకు అవకాశం లేనప్పుడు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశం కల్పించే నిబంధన ఎందుకు వుంటుందని ప్రశ్నిస్తున్నాయి.