కోర్టుకు, కలెక్టరేట్కు బాంబు బెదిరింపులు
హైదరాబాద్: సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్కు గురువారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు సిబ్బందిని బయటకు పంపి బాంబు స్క్వాడ్స్తో, శునకాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం పదకొండున్నర గంటలకు కోర్టు సూపరింటిండెంట్ వద్ద ఉన్న ల్యాండ్లైన్కు ఆగంతకుడు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినట్లు, దాన్ని పేల్చేస్తున్నట్లు చెప్పాడు. ఈ వ్యక్తి తెలుగులో మాట్లాడినట్లు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా నార్త్ జోన్ పోలీసులకు కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్పాడు. ఈ రెండు ఫోన్లు చేసింది ఒకరేనా, ఇద్దరా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోర్టుకు బాంబు బెదిరింపులు ఉట్టివేనని తేల్చేశారు. నక్సలైట్ల పేరు చెప్పి బెదిరించినట్లు కోర్టు సిబ్బంది చెబుతున్నారు. కోర్టు వాయిదా లభించని వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడి వుంటాడని భావిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. కలెక్టర్ బంగ్లాకు వెళ్లిపోయారు. కలెక్టర్ కార్యాలయంలో మూడు బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులు ఉత్తవేనని తనిఖీల్లో తేలింది. అంతేకాకుండా విశాఖపట్నంలోని మూడు పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపించాయి. ఈ బాంబు బెదిరింపులు కూడా ఉత్తవేనని తనిఖీల్లో తేలింది.