వైయస్, బాబు కరచాలనం, మాటామంతి
హైదరాబాద్: స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు మాటా మాటా కలుపుకున్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం గురువారం ఉదయం స్పీకర్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ఇరువురు పక్కపక్కనే కూర్చున్నారు. చంద్రబాబుకు మరో వైపు కూర్చున్న క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు జోకులు వేస్తూ పోయారు. ఆయన జోకులకు ముఖ్యమంత్రి వైయస్, చంద్రబాబు నవ్వడం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించింది. వైయస్, చంద్రబాబు ఉల్లాసంగా పలకరించుకున్నారు.
అనంతరం జరిగిన శాసనసభ సమావేశాలు మాత్రం వేడివేడిగా సాగాయి. వరదపై తక్షణ చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్షాలు శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేశాయి. దీంతో సభ రేపటికి వాయిదా పడింది. శాసనసభ సమావేశాలను ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించడానికి బిఎసిలో ప్రభుత్వం అంగీకరించింది. వరద సహాయంపై చర్చకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.