వైయస్ బావమరిది అనుచరుల వీరంగం
కడప: కడప మేయరు, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు గురువారంనాడు విధ్వంసానికి దిగారు. అక్రమ కలప రవాణా వ్యవహారంలో రవీంద్రనాథ్ రెడ్డిపై ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడం వంటి సంఘటనలకు ఆగ్రహించిన ఆయన అనుచరులు కడప జిల్లా అటవీ శాఖా కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. మొదట కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత కార్యాలయంలోకి చొరబడి ఐదు వాహనాలను, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. వార్త రాసిన ఒక పత్రికా కార్యాలయం ఎదుట కూడా వారు ధర్నా చేశారు. పత్రిక ప్రతులను దగ్ధం చేశారు.
తాను అక్రమ కలప రవాణాకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికే ఆ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ కర్మాగారం కలపతో నడవదని, తాము బొగ్గులనే ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పించుకునేందుకు లారీ డ్రైవర్ తన పేరు చెప్పి వుంటాడని ఆయన అంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద న్యాయపోరాటం చేస్తానని ఆయన చెబుతున్నారు.