తెలంగాణ ఒక్క వ్యక్తి చేతిలోనా?: వెంకయ్య
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని ప్రభుత్వంతో కూడా సంబంధం లేని ఒక్క వ్యక్తి చేతిలో పెట్టడమేమిటని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్య చేశారు. రెండు రోజుల పాటు జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఆయన ఆదివారంనాడు ప్రారంభించారు. రాష్ట్ర భవిష్యత్తును పార్లమెంటు నిర్ణయిస్తుందా, ప్రభుత్వం నిర్ణయిస్తుందా, ప్రభుత్వంతో కూడా సంబంధం లేని వ్యక్తి నిర్ణయిస్తారా అనే విషయంపై చర్చ జరగాల్సి వుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో వుందని ఆయన అన్నారు.
పత్రికల్లో పతాక శీర్షికల కోసం డెడ్లైన్లు పెట్టే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నిసార్లు తెరాస నాయకులు ప్రకటనలు చేస్తారు, ఎన్ని డెడ్లైన్లు పెట్టి హెడ్లైన్లకు ఎక్కుతారు అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని ఆయన విమర్శించారు.