యస్పీపై దాడికి ఎమ్మెల్యే వెంకటరెడ్డిపై కేసు
ఖమ్మం: ఖమ్మం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) ఆర్.కె. మీనాపై దాడి చేశారనే ఆరోపణపై సుజాతనగర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి రెడ్డిపై కేసు నమోదు చేశారు. పండితాపురం గ్రామంలో దాడికి సంబంధించి అందరిపై కేసు నమోదు చేశామని, కొందరిని అరెస్టు చేశామని యస్పీ ఆర్.కె. మీనా మీడియా ప్రతినిధులతో చెప్పారు. అరెస్టు చేసిన వారిని కోర్టుకు పంపామని కూడా ఆయన చెప్పారు. అయితే తనపై కేసు పెట్టిన విషయం తనకు తెలియదని వెంకట రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను యస్పీపై దాడికి దిగలేదని ఆయన అన్నారు.
తల్లిదండ్రులకన్నా తనకు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమని, తమ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీవారు దాడి చేస్తుంటే తాను అడ్డుకోవడానికి ప్రయత్నించానని ఆయన చెప్పారు. ఈ విషయంలో తాను ఏ విధమైన రాజకీయ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై కేసు పెట్టినట్లు పోలీసు అధికారులు తనకు చెప్పలేదని ఆయన అన్నారు. సంఘటనపై విచారణ జరిపించుకోవచ్చునని ఆయన అన్నారు. తాను తప్పు చేయలేదని, తప్పు చేశానని అనుకుంటే విచారణ జరుపుకోవచ్చునని ఆయన అన్నారు.