పోతిరెడ్డిపాడుపై వివాదానికి తావు లేదు: పొన్నాల
న్యూఢిల్లీ: రాయలసీమలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేశారు. స్వపక్షానికే చెందిన శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, పి. జనార్దన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ప్రాజెక్టు కొత్తగా చేపట్టిందేమీ కాదని, అయితే తూములు, కాలువల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించామని, అఖిల పక్ష సమావేశంలో చర్చించిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నామని పొన్నాల లక్ష్మయ్య వివరించారు. పోలవరం ప్రాజెక్టు అనుమతి కోసం ఆయన గురువారం ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
కేంద్ర జలవనరుల మంత్రి సైఫుద్దీన్ సోజ్ను కలిసి ఆయన ఆదివారంనాడు పోలవరం ముంపు ప్రాంతాల వివరాలను, నిర్వాసితుల వివరాలను అందజేశారు. సోజ్తో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 102 టియంసిల నీటిని పంపించడం సాధ్యం కాకపోవడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు సంబంధించి తూములు, కాలువల సామర్థ్యం పెంచుతున్నామని ఆయన చెప్పారు. అయితే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు మిగులు జలాలనే కాకుండా నికర జలాల తరలింపు కూడా జరుగుతుందనే మాట వాస్తవమేనని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు ప్రాజెక్టుపై వివాదానికి తావు లేదని ఆయన అన్నారు.