తెలంగాణపై ఏదో ఒకటి కాంగ్రెస్ చెప్పాలి: బిజెపి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయాన్ని కాంగ్రెస్ కచ్చితంగా చెప్పాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏమిటో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)వారికి అర్థమైందా? అని ఆయన అడిగారు. తెరాసపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఒక కూటమిలో ఉన్న పార్టీపై వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. చెప్పింది చేసే అలవాటు కాంగ్రెస్కు లేదని తాము చెబుతూనే వస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమో, అనుకూలమో వున్న విషయం ప్రజల ముందు చెప్పాలని ఆయన కాంగ్రెస్ను డిమాండ్ చేశారు. తాము గతంలో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే చత్తీస్ఘడ్, ఇతర రాష్ట్రాల ఏర్పాటకు ప్రక్రియను ప్రారంభించామని, తెలంగాణపై కాంగ్రెస్ హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు గడిచిందని, ఇప్పటికి కూడా ఏమీ చెప్పడం లేదని ఆయన అన్నారు. ఎంతకాలం ఇలా మభ్యపెడుతూ వుంటారని ఆయన కాంగ్రెస్ నాయకులను అడిగారు.