కెజిహెచ్ ఘటనపై త్రిసభ్య సంఘం విచారణ: సియం
హైదరాబాద్: కెజిహెచ్ వైద్యాధికారి బంగారయ్యపై దాడి సంఘటనపై త్రిసభ్య సంఘంతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. వైద్యులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తన నేతృత్వంలో మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన ఆ హామీలు ఇచ్చారు. ఆందోళన విరమించి విధుల్లో చేరాలని అఖిల పక్ష సమావేశం వైద్యులకు విజ్ఞప్తి చేసింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల శ్రీను అనే రోగి మరణించాడని ఆరోపిస్తూ అతని బంధువులు కెజిహెచ్ వైద్యాధికారి బంగారయ్యపై దాడి చేశారు. దాంతో కెజిహెచ్ వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేపట్టారు. వైద్యాధికారిపై దాడి కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశామని, మిగతా వారిని కూ అరెస్టు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందరినీ అరెస్టు చేసేవరకు ఆందోళనను విరమించబోమని వైద్యులు అనడం సరికాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య అఖిల పక్ష సమావేశానంతరం చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, తీవ్రంగా గాయపడిన బంగారయ్య హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.