కొనసాగుతున్న కెజిహెచ్ వైద్యులు ఆందోళన
హైదరాబాద్: విశాఖపట్నం కెజిహెచ్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం నాడు కూడా తమ ఆందోళననను కొనసాగిస్తున్నారు. దీంతో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇతర ప్రాంతాల రోగులు ఆస్పత్రిలోనే పడిగాపులు కాస్తుండగా స్థానికులు ఆస్పత్రి నుంచి వెళ్లిపోతున్నారు. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అయితే మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రైవేట్ ఆస్పత్రులను కూడా మూసివేయడంతో రోగులు అనేక ఇక్కట్లకు గురయ్యారు. వైద్యాధికారి బంగారయ్యపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన సాగుతుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది పరిపాలనా విభాగం వద్ద ప్రదర్శన నిర్వహించారు. బంగారయ్యకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కెజిహెచ్ ఆస్పత్రి వైద్యులకు సంఘీభావంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వైద్యులు ఆందోళనకు దిగారు. అయితే అత్యవసర సేవలను మాత్రం అందిస్తున్నారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట ఏరియా ఆస్పత్రి వైద్యులు ధర్నాకు దిగారు. ఇతర ప్రాంతాల్లో కూడా వైద్యులు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. బంగారయ్యపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకునేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు చెబుతున్నారు.