తెలంగాణకు లెఫ్ట్ విముఖత: దిగిరాని కెసిఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వామపక్షాలు విముఖత వ్యక్తం చేశాయి. తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు మంగళవారంనాడు వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు ఈ సమావేశంలో వామపక్షాల నాయకులు విముఖత వ్యక్తం చేశారు. అయితే తొందరపడి రాజీనామాలు చేయవద్దని మాత్రం వామపక్షాల నాయకులు తెరాస నేత కెసిఆర్ను కోరారు. సమావేశానికి మధ్యలో ఎన్సిపి నేత శరద్ పవార్ హాజరయ్యారు. వామపక్షాల నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోవడంతో కెసిఆర్ అసంతృప్తితో సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
కొన్ని ప్రత్యేక రాజకీయ అవసరాల కోసం యుపిఎ ఏర్పడిందని వామపక్షాల నాయకులు వాదిస్తున్నారు. యుపిఎలో ఏకాభిప్రాయ కుదరలేదని ప్రణబ్ ముఖర్జీ కెసిఆర్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే కెసిఆర్ అందుకు ఒప్పుకోలేదని తెలిసింది. అయితే ఈలోగా తెలంగాణపై కాంగ్రెస్ ఒక ప్రకటన చేయవచ్చునని, దీని వల్ల తెరాస యుపిఎ వైదొలిగే అవకాశాలు లేవని వార్తలు వెలువడ్డాయి. రెండో ఎస్సార్సీపై తెరాసకు, కాంగ్రెస్కు మధ్య ఒప్పందం కుదురుతుందని, దీనితో తెరాస నాయకులు మనసు మార్చుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.