స్కాలర్షిప్లపై అసెంబ్లీ నుంచి విపక్షాల వాకౌట్
హైదరాబాద్: విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయడంలో చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా ప్రతిపక్షాలు మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో తాము వేసిన ప్రశ్నలకు మంత్రి రెడ్యా నాయక్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని సిపిఐ సభ్యులు నిరసన వ్యక్తం చేయగా తెలుగుదేశం, సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు సభ వాకౌట్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు నిధుల విడుదల సంబంధం లేకుండా పోయిందని ప్రతిపక్షాల సభ్యులు విమర్శించారు.
స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు పస్తులుండే పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదని ఆయన విమర్శించారు. అయితే తాము గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువ మొత్తంలో స్కాలర్షిప్లు విడుదల చేశామని మంత్రి రెడ్యా నాయక్ చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.