కాంగ్రెసే కాదు, తెరాసా మోసం చేసింది: బిజెపి
మెదక్: తెలంగాన ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ఒక్కటే కాదని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా మోసం చేసిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఇంతకాలం మోసం చేసినందుకు తెరాస అగ్రనేతలు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్ర క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెరాస నేతలు పదవులకు రాజీనామా చేయడం త్యాగం కాదని, రాజీనామాల వెనక వున్న రహస్యమేమిటో తెలియాల్సి వుందని ఆయన అన్నారు. తమకు సోనియాపై నమ్మకం వుందని తెరాస నేతలు అన్నారని, పోరాటం అవసరం లేదని అన్నారని, ఇది మోసం కాదా అని ఆయన అన్నారు. లాబీయింగ్ ద్వారా తెలంగాణ రాదని తేలిపోయిందని, ముందున్న కర్తవ్యం సంఘర్షణేనని ఆయన అన్నారు. ప్రస్తుత పరిణామాలపై వేచి చూసి సమీక్షిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు తాము దీర్ఘకాలిక ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. వై.యస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నంత వరకు తెలంగాణ రాదని ఆయన చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు వల్ల భూములు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు. అధికారుల మాటలను తప్ప ప్రజల గోడును వినిపించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. వైయస్ ప్రభుత్వం 92 వేల ఎకరాల భూములను ధారాదత్తం చేయడానికి కుట్ర పన్నిందని ఆయన అన్నారు. భూమికి భూమి అన్న డిమాండ్తో రింగ్ రోడ్డు బాధితులతో ఈ నెల 25వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు.