మేమూ పోరాడుతాం: తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తనపై వేసిన ద్రోహి, దొంగ అనే ముద్రలను తొలగిస్తే తాను తమ పార్టీ నాయకత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి పదవులు వదిలి ఉద్యమాన్ని చేపట్టాలని తాను సూచించినందుకే తనపై నిందలు వేశారని, ఇప్పటికైనా తమ నాయకులు మంత్రి పదవులకు రాజీనామా చేయడం ఆనందదాయకమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ మోసం చేస్తోందని ఇప్పటికైనా తమ నాయకులు తెలుసుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు. గత ఏడు మాసాలుగా తనను సమావేశాలకు కూడా పిలవడం లేదని, తాను ఇతర వేదికల ద్వారా తెలంగాణ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.
తమ పార్టీ నాయకులు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడం గొప్ప విషయమేమీ కాదని పార్టీ మరో అసమ్మతి శాసనసభ్యుడు దుగ్యాల శ్రీనివాసరావు అన్నారు. తమ నేత కె. చంద్రశేఖరరావు కోవర్టులు లేని వేదికల ద్వారా తెలంగాణ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు. ఒక వైపు అభివృద్ధి కోసం కృషి సాగిస్తూనే మరో వైపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ అభివృద్ధికి పని చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. ఉద్యమం హింసామార్గం పడుతుందనే సూచలను అందిస్తున్నారని, అది మంచిది కాదని ఆయన అన్నారు.