జంతర్మంతర్ వద్ద కెసిఆర్ నిరశన దీక్ష
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత కె. చంద్రశేఖరరావు బుధవారంనాడు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రాణాలు పోయినా ఫరవాలేదని, తెలంగాణను సాధించి తీరుతామని ఆయన అన్నారు. ఉద్యమాన్ని విస్తృతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కెసిఆర్కు శాసనసభ్యుడు డాక్టర్ నగేశ్, చెరుకు సుధాకర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన రక్తంపోటును కూడా వారు పరిశీలించారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రశేఖరరావు ప్రసంగించారు.
తమది న్యాయమైన పోరాటమని, న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతామని ఆయన చెప్పారు. కెసిఆర్ను మాజీ ప్రధాని వి.పి. సింగ్ పరామర్శించారు. కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలు చేశారు. దీక్షల వల్ల లాభం లేదని, ఒత్తిడి తేవడానికి ఇది సరిపోదని వి.పి. సింగ్ అన్నారు. సియంపిలో చేర్చి తెలంగాణ ఇవ్వకపోవడం వైఫల్యమని ఆయన అన్నారు.