కెసిఆర్ దీక్షకు మద్దతుగా తెలంగాణలో ఆందోళనలు
హైదరాబాద్: కేంద్ర మంత్రి పదవులకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కె చంద్రశేఖరరావు, ఎ నరేంద్ర రాజీనామాలు చేశారనే వార్త అందిన వెంటనే తెలంగాణలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆందోళనా కార్యక్రమాలు జరిగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థుల నిరాహారదీక్షలకు తెరాస శాసనసభ్యులు అక్కడికి వెళ్లి మద్దతు ప్రకటించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో తెరాస కార్యకర్తలు, తెరాస యువజన కార్యకర్తలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు.
వరంగల్, హన్మకొండలలో కూడా తెరాస కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలకు పూనుకున్నారు. హన్మకొండ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. వరంగల్లోని న్యాయవాదులు కూడా ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డిల్లో తెరాస కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద తెరాస నాయకులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూరు, బెల్లంపల్లిల్లో తెరాస కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. తమ అసమ్మతి శాసనసభ్యుడు దుగ్యాల శ్రీనివాసరావు ఇంటిని తెరాస కార్యకర్తలు చుట్టుముట్టారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు.