దీక్ష విరమించండి: కెసిఆర్కు సోమనాథ్ విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్షను విరమించుకోవాలని లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, లోక్సభ సభ్యుడు కె. చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. దీక్ష విరమించాలని తాను కెసిఆర్కు విజ్ఞప్తి చేయడం ఇది పదోసారి అని ఆయన గురువారం లోక్సభలో అన్నారు. సమస్య వుందని, అయినా దీక్ష విరమించాలని తాను కోరుతున్నానని ఆయన అన్నారు. దీక్ష విరమించాలని లోక్సభ సభ్యులందరూ కెసిఆర్ను కోరాలని ఆయన సూచించారు. తమ నేతలు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్ర కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి, తాము యుపిఎ నుంచి బయటకు రావడానికి గల కారణాలను తెరాస సభ్యులు లోక్సభలో వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టించిందని తెరాస లోక్సభ సభ్యుడు మధుసూదన్ రెడ్డి విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలో ఎక్కడా రెండో ఎస్సార్సీ ప్రస్తావన లేదని ఆయన స్పష్టం చేశారు. ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని యుపిఎ కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో హామీ ఇచ్చారని, రాష్ట్రపతి ప్రసంగంలోనూ దాన్ని చేర్చారని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయాన్ని సాధించడానికి వేసిన ప్రణబ్ కమిటీ 8 వారాల్లో నివేదిక సమర్పిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారని, 80 వారాలైనా దానికి అతీగతీ లేకుండా పోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ రెండో ఎస్సార్సీకే కట్టుబడి వుంటే ఆ హామీలన్నీ ఎందుకు ఇచ్చినట్లు అని అడిగారు. తెలంగాణకు అనుకూలంగా మెజారిటీ యుపిఎ భాగస్వామ్య పక్షాలు ప్రణబ్ కమిటీకి లేఖలు రాశాయని, బిజెపి వైఖరి తెలిసిన గంటలోగా తాను నివేదిక సమర్పిస్తానని ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్లో జరిగిన ఎఐసిసి సమావేశాల సందర్భంగా చెప్పారని, తెలంగాణ బిల్లును సమర్థిస్తామని బిజెపి తీర్మానం చేసిన తర్వాత కూడా నివేదిక ఇవ్వడం లేదని, పైగా బిజెపి మద్దతు తీసుకోబోమని ఇప్పుడు చెబుతున్నారని ఆయన వివరించారు.