నిరశన దీక్ష విరమణకు కెసిఆర్పై ఒత్తిడి
న్యూఢిల్లీ: నిరశన దీక్ష విరమించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావుపై ఒత్తిడి పెరుగుతోంది. ఆయన దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర పార్టీల నాయకులు ఆయనను దీక్షా శిబిరంలో పరామర్శిస్తున్నారు. ఢిల్లీలో తాము చేయాల్సిన పని అయిపోయిందని, ఇక తెలంగాణ క్షేత్రంలో పని చేయాల్సి వుందని, అందుకని కెసిఆర్ దీక్ష విరమించడం అవసరమని తెరాస మరో అగ్రనేత ఎ. నరేంద్ర అన్నారు.
కెసిఆర్ చేత ఈ రోజు కాకపోయినా రేపయినా దీక్ష విరమింపజేస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణలో తాము యుద్ధభేరీ మోగించాల్సి వుందని ఆయన అన్నారు. దీక్షలో కూర్చుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని బలహీన పడడం అంత మంచిది కాదని, వ్యక్తిగతంగా శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకుని తెలంగాణ ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల కడుపుల్లో తలలు పెట్టి చైతన్యపరుద్దామని ఆయన కెసిఆర్కు సూచించారు.