అవుటర్ రింగ్ రోడ్డు: అసెంబ్లీ ముట్టడి
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్వాసితులు శుక్రవారం శాసనసభను ముట్టడించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతల నాయకత్వంలో వారు ఈ ముట్టడికి పూనుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. అరెస్టులు కూడా చేశారు. తమకు భూమికి భూమి ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ధరించి నినాదాలు చేస్తూ వారు అసెంబ్లీ ముట్టడికి దిగారు.
అవుటర్ రింగ్ రోడ్డు పేరు మీద ప్రభుత్వం పేదలను వీధుల్లోకి నెట్టిందని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి. కిషన్రెడ్డి విమర్శించారు. పెద్దల భూములను కాపాడి, పేదల భూములను సేకరించడానికి ప్రభుత్వం రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాహితం కోసం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ప్రభుత్వం భూమిని సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. పేదల భూములను సేకరించి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఆందోళనలో బిజెపి నేతలు డాక్టర్ కె. లక్ష్మణ్, బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.