కోటా బిల్లు ప్రతిపాదన: ప్రస్తావన లేని క్రీమీలేయర్
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన కోటా బిల్లును కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్ శుక్రవారం లోక్సభలో ప్రతిపాదించారు. కేంద్ర విద్యాసంస్థల్లో ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే బిల్లులో క్రీమీలేయర్ ప్రస్తావన లేదు. సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను ఒబిసిలుగా గుర్తిస్తారు. కోటా నుంచి 19 విద్యాసంస్థలను మినహాయించారు.
హోమీ బాబా జాతీయ సంస్థ, బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి దాని అనుబంధ సంస్థలు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ సైంటిఫిక్ రీసెర్చ్, తదితర సంస్థలను కోటా నుంచి మినహాయించారు. కాగా కోటా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. ఢిల్లీలోని మూడు వైద్య కళశాలల విద్యార్థులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఎయిమ్స్, యంఎయంసి రెసిడెంట్ డాక్టర్లు మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఆందోళనకారులు పార్లమెంటు భవనం దిశగా ర్యాలీ నిర్వహించారు.